దానివల్లే చాహల్‌ రాటుదేలాడు!

2 Feb, 2017 10:23 IST|Sakshi
దానివల్లే చాహల్‌ రాటుదేలాడు!

మూడో టీ-20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు ఒక దశలో 119/2తో బలంగా కనిపించినప్పటికీ చాహల్‌ స్పిన్‌ మాయాజాలంతో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. యువ బౌలర్లు చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా పోటాపోటీగా వికెట్లు తీయడంతో ఆరుగురు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చాహల్‌ మాయాజాలంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. అతను ఐపీఎల్‌ ప్రాడక్ట్‌ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ఆడటం వల్ల చాహల్‌ రాటుదేలాడు అని పేర్కొన్నాడు.

’చాహల్‌ బెంగళూరు రాయల్‌ చాలెంజర్‌ బౌలర్‌ అన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ వేదికపై ఆడటం అతనికి తెలుసు. టీ-20 క్రికెట్‌ ఐపీఎల్‌ ప్రాడక్ట్‌. అదేవిధంగా చాహల్‌ కూడా ఐపీఎల్‌ ప్రాడక్టే. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా అతను ఎంతగానో మెరుగయ్యాడు. కచ్చితంగా ఏం చేయాలో అతనికి తెలుసు. అతను టెర్రిఫిక్‌గా ఆడాడు. భారత టీ-20లపై ఐపీఎల్‌ విస్తారమైన ప్రభావాన్ని చూపుతోంది. చాలామంది ఆటగాళ్లు దానినుంచే వచ్చి భారత్‌ తరఫున అద్భుతంగా ఆడుతున్నారు’ అని గంగూలీ గుర్తుచేశాడు.
 

మరిన్ని వార్తలు