చైనా చొరబాట్లపై నిర్లక్ష్యమెందుకు?

6 Aug, 2013 01:28 IST|Sakshi

న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చైనా చొరబడుతున్నా.. కేంద్రం ఆ సమస్యను తగ్గించి చూపేందుకు యత్నిస్తోందని లోక్‌సభలో ఎంపీలు మండిపడ్డారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా 29 మంది ఎంపీలు సంధించిన ప్రశ్నలకు.. రక్షణమంత్రి ఆంటోనీ సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. 2010 నుంచి వివిధ దేశాలు భారత గగనతలాన్ని 28 సార్లు ఉల్లంఘించాయని వెల్లడిం చారు. కానీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్ల అంశంపై సరైన వివరణ ఇవ్వలేదు. చైనా, భారత్ మధ్య వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల మధ్య పలు విభేదాలున్నాయని.. అందువల్ల పలుమార్లు సరిహద్దుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
 
 వికలాంగుల రిజర్వేషన్ పెంపు: వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్ 5 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్రం ఓకే చెప్పింది. పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్-1995 చట్టం ప్రకారం ఇప్పుడు 3 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని, అయితే వారికి మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతున్నట్లు సాధికార త, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ రాజ్యసభలో చెప్పారు.
 
 తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2008లో ప్రభుత్వ ఉద్యోగాలు 1,76,74,000గా ఉండగా... 2011 నాటికి 1,75,48,000కు తగ్గిపోయాయని, ప్రైవే టు ఉద్యోగాలు మాత్రం 98,75,000 నుంచి 1,14,52,000కు పెరిగాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి సురేష్ లోక్‌సభలో చెప్పారు.

>
మరిన్ని వార్తలు