బీజేపీ గెలుపుపై సీఎం ఆసక్తికర విశ్లేషణ

12 Mar, 2017 16:27 IST|Sakshi
బీజేపీ గెలుపుపై సీఎం ఆసక్తికర విశ్లేషణ

నోట్లరద్దు వల్లే గెలిచిందట...

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలకు, నేతలకు అభినందనలు తెలిపిన బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయాలను నమోదుచేసిందని పేర్కొన్న ఆయన.. ఈ ఫలితాల ద్వారా వెనుకబడిన తరగతులవారి మద్దతును బీజేపీ కూడగట్టుకోగలిగిందని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల వారిని బీజేపేతర పార్టీలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును బాహాటంగా సమర్థించిన నితీశ్‌కుమార్‌.. బీజేపీ విజయాలకు డిమానిటైజేషన్‌తో లింక్‌ పెట్టడం గమనార్హం. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అంత తీవ్రంగా విమర్శలు, పెడబొబ్బలు పెట్టాల్సింది కాదని, అలా చేయడం ఎన్నికల్లో వారిని దెబ్బతీసిందని ఆయన విశ్లేషించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సంపన్నులే ఇబ్బందిపడ్డారని పేదలు భావించినట్టు ఆయన ఆన్‌లైన్‌లో పెట్టిన తన పోస్టులో పేర్కొన్నారు. బిహార్‌ తరహాలో మహాకూటమిని ఏర్పాటుచేయకపోవడం వల్లే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైందని నితీశ్‌ విశ్లేషించారు.

మరిన్ని వార్తలు