సీఎం ఆస్తుల్లో పది ఆవులు, ఐదు దూడలు!

3 Jan, 2017 08:29 IST|Sakshi
సీఎం ఆస్తుల్లో పది ఆవులు, ఐదు దూడలు!

పట్నా: సాధారణంగా ఆవులు, గేదెల వంటి పశు పోషణ అనగానే బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గుర్తొస్తారు. కానీ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ చరాస్తుల్లోనూ 10 ఆవులు, 5 దూడలు ఉన్నాయి. నితీశ్, ఆయన మంత్రివర్గ సహచరులు డిసెంబర్‌ 31న తమ ఆస్తులను ప్రకటించారు. అందులో నితీశ్‌ తన వద్దనున్న ఆవులు, దూడల విలువను రూ. 1.45 లక్షలుగా ఆయన పేర్కొన్నారు.

సీఎం నితీశ్‌ వద్ద రూ. 56.49 లక్షల విలువ కలిగిన స్థిర, చరాస్తులున్నాయి. వాటిలో ఢిల్లీలోని రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 16.49 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. వాటిలో ఒక ఫోర్డ్‌ ఇకోస్పోర్ట్, ఒక హ్యుందయ్‌ గ్రాండ్‌ ఐ10 కార్లున్నాయి. అలాగే, ఆయన పేరుపై రూ. 3.79 లక్షల వాహన రుణం కూడా ఉంది. కాగా, నితీశ్‌ కుమారుడు నిశాంత్‌ వద్ద నితీశ్‌ కన్నా నాలుగు రెట్లు అధికంగా విలువ కలిగిన స్థిర, చరాస్తులుండటం విశేషం. ఆయన పేరుపై రూ. 2.36 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.

మరిన్ని వార్తలు