కొలీజియం పారదర్శకత ఎంత?: కేంద్రం

17 Oct, 2015 02:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌జేఏసీని సుప్రీం కోర్టు కొట్టేయటంపై కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  కొలీజియం పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేసింది. కొలీజియం పనితీరు సరిగా లేనందునే కొత్త చట్టాన్ని రూపొంచిందించామని.. న్యాయవస్థ గౌరవం ఏమాత్రం తగ్గకుండా కొత్త బిల్లును రూపొందించినా.. దీన్ని తిరస్కరించటం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నవంబర్ 3 తర్వాత కొలీజియం వ్యవస్థలో మార్పులకు సంబంధించిన వాదనలు వింటామని కోర్టు చెప్పటం.. వ్యవస్థలో తప్పులను ఒప్పుకున్నట్లేనన్నారు.

సుప్రీం తీర్పు భారతదేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించేలా ఉందని న్యాయ మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. తీర్పు ఆశ్చర్యం కలిగించిందని మరో మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  తీర్పును గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే.. కొలీజియం వ్యవస్థపై అనుమానాలున్నందునే పార్లమెంటులో ఎన్‌జేఏసీకి మద్దతు తెలిపామన్నారు. కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటు అవసరమని వామపక్షాలు అన్నాయి. పాత వ్యవస్థ పనితీరుపై అనుమానాలున్నందునే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తెలిపారు.
 
కింకర్తవ్యం!
న్యూఢిల్లీ: సుప్రీం తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యచరణ ఎలా ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి కీలకమైన ఈ చట్టంపై అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. కొలీజియాన్ని మెరుగుపర్చేందుకు  తదుపరి విచారణ కొనసాగించాలని సుప్రీం నిర్ణయించడంతో..ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వవాదనను మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కొలీజియాన్ని కొనసాగిస్తూనే, న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా దాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని మార్పులను సూచించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు