పుణే: మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, లోకమాన్య బాల్గంగాధర్ తిలక్ కుటుంబ వారసుడు రోహిత్ తిలక్పై పోలీసులు రేప్ కేసు నమోదుచేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రోహిత్ తనపై పదేపదే అత్యాచారం చేశాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోహిత్పై పోలీసులు ఐపీసీ 376 (రేప్), 323 (గాయపర్చడం), 504, 506, 507(నేరపూరితంగా బెదిరించడం) తదితర సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.
రోహిత్ లోకమాన్య తిలక్ కుటుంబానికి చెందినవారు. ఆయన తాత జయంత్రావు తిలక్ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పనిచేయగా, ఆయన తండ్రి దీపక్ తిలక్ తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ వైస్ చాన్స్లర్గా పనిచేశారు. 40 ఏళ్ల బాధితురాలు, తిలక్ ఒకరికి ఒకరు తెలుసునని, ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని తిలక్ తనను మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పుణె కస్బాపేట్ సీటు నుంచి పోటీ చేసిన రోహిత్ తిలక్ బీజేపీ అభ్యర్థి గిరిష్ బాపట్ చేతిలో ఓడిపోయారు.