గువాహటి/దిఫు (అస్సాం): కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని మంగళవారం గువాహటిలోని వెటర్నరీ ఫీల్డ్లో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఆ మార్పును వేగంగా పూర్తి చేస్తామన్నారు. రాజకీయ నాయకుల కుటుంబంలోని సభ్యులకు టికెట్లు ఇచ్చే విధానానికి తాను వ్యతిరేకమని రాహుల్ స్పష్టం చేశారు.
దానిలో భాగంగానే అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పు చేశామన్నారు. తమ ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలన్నారు. భవిష్యత్లో ప్రతి అభ్యర్థినీ అంతర్గత ఎన్నికల విధానం ద్వారానే ఎంచుకోవాలన్నదే తన యోచన అని తెలిపారు. మహిళలను మరింత శక్తిమంతుల్ని చేసే విధంగా పార్టీ నేతలు కృషి చేయాలని ఉద్బోధించారు. సభలో పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారని, భవిష్యత్లో ఆ సంఖ్య సమానంగా ఉం డాలని కోరుకుంటున్నానని చెప్పారు.