కాంగ్రెస్‌లో ‘బాహుబలి’ రచ్చ!

21 Mar, 2017 03:42 IST|Sakshi
కాంగ్రెస్‌లో ‘బాహుబలి’ రచ్చ!

- పార్టీలో సమర్థులు లేరని జానారెడ్డి చెప్తారా..?
- సీనియర్లలో అసంతృప్తి


సాక్షి, హైదరాబాద్‌:
టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సద్దుమణిగినా ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నట్టు, కేసీఆర్‌ను ఓడించడానికి బయటనుంచి ఎవరో రావాలన్నట్టుగా జానారెడ్డి మాట్లాడారని పలువురు సీనియర్లు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రనేతగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానా స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయదా అని ప్రశ్నిస్తున్నారు.

‘తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కి, రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చూపించిన పట్టు దల, చిత్తశుద్ధిపై తెలంగాణవాదుల్లో, ముఖ్యంగా యువతలో సానుకూల దృక్పథం ఉందని వారు అన్నారు. కాంగ్రెస్‌ పట్ల ఉన్న అనుకూలతను వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుని, పార్టీకి పూర్వవైభ వం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్‌ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా కీలక నాయకుడు మాట్లాడటం తప్పు డు సంకేతాలను పంపించదా’ అని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు ప్రశ్నించారు. ‘శాసనసభలో కేసీఆర్‌ను ఎదిరించే బాహుబలి లేరేమోకానీ, టీపీసీసీలో చాలామంది బాహుబలిలు ఉన్నారు’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.

అధిష్టానానికి ఫిర్యాదు.. ఆరా..
అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన జానాపై చర్యలు తీసు కోవాలని పార్టీలోని కొందరు సీనియర్లు అధిష్టా నానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీనిపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టుగా టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. జానా వ్యాఖ్యలు.. దాని వెనుకనున్న ఉద్దేశమేమిటనేది అధిష్టానంలో ని ముఖ్యులు కొందరు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.