నీమచ్: డ్యూటీలో ఉన్న సమయంలోనే ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వార్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని రత్నఘర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..
రత్నఘర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న జగదీశ్ కటారా(22) మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత స్టేషన్ ప్రాంగణంలోనే ఛాతికి తుపాకి గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. రక్తస్త్రావం అవుతుండగా సహచరులు జగదీశ్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబకలహాల కారణంగానే జగదీశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు.