కోపరేటివ్ బ్యాంకులు ఆ డిపాజిట్లు స్వీకరించవు

20 Jan, 2017 17:50 IST|Sakshi
కోపరేటివ్ బ్యాంకులు ఆ డిపాజిట్లు స్వీకరించవు
న్యూఢిల్లీ : రద్దయిన నోట్ల డిపాజిట్కు గడువు ముగిసినప్పటికీ నల్లధనం వివరాల వెల్లడికి మరో అవకాశమిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద పాత నోట్లను డిపాజిట్ల చేసుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా నల్లకుబేరులు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ అనుమతి ఇప్పటినుంచి సహకార బ్యాంకుల్లో వర్తించదు. పీఎంజీకేవై కింద పాత నోట్లను కోపరేటివ్(సహకార) బ్యాంకులు స్వీకరించవని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దీనికి గల ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు అనంతరం కోపరేటివ్ బ్యాంకుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ గుర్తించడమే.
 
కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్టు ఐటీ డిపార్ట్మెంట్ ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీఎంజీకేవై కింద స్వీకరించే డిపాజిట్లను కోపరేటివ్ బ్యాంకులు స్వీకరించవని ప్రభుత్వం తెలిపింది. పీఎంజీకేవై కింద డిపాజిట్ చేసే నగదుపై 50 శాతం పన్నును అకౌంట్ హోల్డర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నగదులో25 శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ స్కీమ్ను కూడా వాడుకోకుండా తమంతట తాముగా మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని కేంద్రం హెచ్చరించింది. 
 
>
మరిన్ని వార్తలు