అహ్మదాబాద్: ఒక ప్రభుత్వ అధికారి అవినీతిపరుడంటూ అతనితో బలవంతంగా కరెన్సీ నోట్లు తినిపించారు ఓ ఎన్జీవో కార్యకర్తలు! అహ్మదాబాద్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. మునిసిపల్ కార్పొరేషన్ వెస్ట్జోన్ పన్ను విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ధర్మీన్ వ్యాస్ అవినీతికి పాల్పడుతున్నాడని లోక్రక్షక్ సేవా సమితి కార్యకర్తలు 30 మంది ఆయన ఆఫీసుకు వెళ్లారు. కవరేజీ కోసం మీడియానూ పిలిపించారు. నోట్లకు పచ్చడి పూసి తినాలని వ్యాస్కు చెప్పారు.
అతడు ప్రతిఘటించడంతో నోటిని బలవంతంగా తెరిచి నోట్లు కుక్కారు. ఈ దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. వ్యాస్ ఫిర్యాదుపై పోలీసులు నిందితులపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్జీఓ చీఫ్ పృథీభట్ను అరెస్ట్ చేశారు. తానే తప్పూ చేయలేదని భట్ అన్నాడు. గతంలో అవితీపరుడైన ఓ మునిసిపల్ అధికారితో మురికినీటిని తాగించామన్నారు.