మోడీని విమర్శిస్తే సహించం: ఆర్ఎస్ఎస్

17 Aug, 2013 11:53 IST|Sakshi

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శస్తే సహించేది లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు సురేష్ సోని భారతీయ జనతా పార్టీలోని అంతర్గత శ్రేణులను శనివారం హెచ్చరించారు. భారత ప్రధాన పదవికి మోడీ సరైన వ్యక్తి అని అందరు భావిస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆయనపై విమర్శలు తగవని సోని అభిప్రాయపడ్డారు. ఎవరైనా మోడీపై విమర్శలు చేసినా,  పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని అతిక్రమిస్తే వారిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
 
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు బలంగా వీస్తునందున, కొద్దిగా కష్టపడితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. దీంతో అవినీతి ఊబిలో కురుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేయవచ్చన్నారు. అంతేకాకుండా బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే భారత పౌరులకు అత్యంత సమర్థవంతమైన పాలన అందించగలుగుతామన్నారు. భారతీయ జనతాపార్టీ తిరిగి దేశపాలన పగ్గాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ శ్రేణులకు సోని  ఈ సందర్బంగా  పిలుపునిచ్చారు.

దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనాతా పార్టీ ఢీల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులోభాగంగా లోక్సభలో అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో సీట్లు కొల్లగొడితే ప్రధాని కుర్చీని కైవసం చేసుకోవచ్చని  బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు సురేష్ సోని రెండు రోజుల పర్యటనలో భాగంగా యూపీలో పర్యటిస్తున్నారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయ్తో కలసి ఆయన ప్రసంగించారు.

మరిన్ని వార్తలు