కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

25 Sep, 2016 12:33 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో అన్ని ప్రాంతాల్లో ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేశారు. కాగా ప్రజలు గుమికూడకుండా ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌ లోయలో భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి.

కశ్మీర్‌లోయలో అల్లర్లు తగ్గుముఖం పట్టడం, పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూ తొలగించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆదివారం కశ్మీర్‌లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కాగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో వాణిజ్య సముదాయాలను తెరవలేదు. నిత్యవసర వస్తువుల మార్కెట్లను ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెరుస్తారని భావిస్తున్నారు. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ అనంతరం కశ్మీర్‌ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 79 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో 82 మంది మరణించారు.
 

మరిన్ని వార్తలు