ఫ్యాన్స్‌ చర్యతో డేవిడ్‌ వార్నర్‌ పరేశాన్‌!

16 Apr, 2017 11:10 IST|Sakshi
ఫ్యాన్స్‌ చర్యతో డేవిడ్‌ వార్నర్‌ పరేశాన్‌!

కోల్‌కతా: ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచంలో ఎంతోమంది మేటి బౌలర్లను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా శనివారమిక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి చిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌ ఛేజింగ్‌ సందర్భంగా ఎనిమిదో ఓవర్‌లో ఫ్లాష్‌లైట్లతో వార్నర్‌ ఒక్కసారిగా చికాకు పడ్డాడు. అభిమానుల చర్య అతన్ని ఇబ్బందిపడేలా చేసింది. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు మైదానంలో అభిమానులు ఈ మధ్య తమ ఫోన్లలోని ఫ్లాష్‌లైట్లను వెలిగించి.. ఆ ప్రకాశవంతమైన వెలుగుతో క్రికెటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా అభిమానులు ఇదేవిధంగా ప్రవర్తించారు. కానీ ఈ చర్య వార్నర్‌ను సంతోషపెట్టలేదు. కోల్‌కతా చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బౌలింగ్‌  ఎదుర్కొంటుండగా అతన్ని ఇది చికాకు పెట్టింది. బౌలింగ్‌ దృష్టి పెట్టకుండా చేసి​ ఇబ్బందికి గురిచేసింది.

ఈ ఓవర్‌లో మొదటి ఐదు బంతులకు పరుగులు రాలేదు. ఓసారి స్టంపౌట్‌ అవకాశం తృటిలో చేజారింది. ఈ నేపథ్యంలో వార్నర్‌ నేరుగా వెళ్లి ఎంపైర్‌కు మొరపెట్టుకున్నాడు. అభిమానుల ఫ్లాష్‌లైట్ల వల్ల తన ఏకాగ్రత దెబ్బతిని సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నానని, ఆ లైట్లు ఆఫ్‌ చేసేలా చూడాలని వేడుకున్నాడు. ప్రకాశవంతమైన తెల్లని ఫ్లాష్‌లైట్‌ వెలుగువల్ల కుల్దీప్‌ మణికట్టును తాను చూడలేకపోతున్నానని, దానివల్ల అతని బౌలింగ్‌ అంచనా వేయడం కుదరడం లేదని చెప్పాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో చాలా చికాకు పడ్డ వార్నర్‌ ఆ తర్వాత కొద్దిసేపటికే 26 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ పెద్దగా రాణించలేదు. దీంతో 17 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో హైదరాబాద్‌ ఓడిపోయింది
 

మరిన్ని వార్తలు