చచ్చాడు.. బతికాడు.. మళ్లీ చచ్చాడు

15 Oct, 2015 08:54 IST|Sakshi
చచ్చాడు.. బతికాడు.. మళ్లీ చచ్చాడు

ముంబయి: చనిపోయిన వ్యక్తి పోస్టు మార్టానికి తీసుకెళ్లాక లేచి అందరినీ అవాక్కయ్యేలా చేసి రెండు రోజులు ప్రాణాలతో ఉండి తిరిగి మళ్లీ చనిపోయాడు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. గత ఆదివారం ముంబయి నగరంలో ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. రోడ్లు వెంట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో ఓ ఆస్పత్రికి సమీపంలో ప్రకాశ్(50) అనే ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు.

అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా నాడీ పరీక్షించిన వైద్యుడు అతడిని చనిపోయినట్లు నిర్ధారించాడు. దీంతో పోస్టుమార్టానికి కావాల్సిన ప్రక్రియ పూర్తి చేసి పోస్టుమార్టం ప్రారంభించే సమయంలో లేచి కూర్చుని మొత్తం ఆస్పత్రినే కాకుండా పోలీసులను కూడా అవాక్కయ్యేలా చేశాడు. అయితే, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారని పలు రకాలుగా విమర్శించారు. ఆ వెంటనే అతడిని ఐసీయూలోకి తరలించారు. అయితే, అలా బతికిన వ్యక్తి రెండు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండి ఐసీయూలో మంగళవారం చనిపోయాడు. ఆస్పత్రి డీన్ సులేమాన్ మర్చంట్ ఈ విషయం ధ్రువీకరించారు.  
 

>
మరిన్ని వార్తలు