నిర్భయ కేసులో నేడు తుది తీర్పు

10 Sep, 2013 08:06 IST|Sakshi
నిర్భయ కేసులో నేడు తుది తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన 'నిర్భయ' కేసుకు సంబంధించిన తీర్పు మంగళవారం ఢిల్లీ కోర్టు వెల్లడించనుంది. 2012 లో డిసెంబర్ 16 తేదిన జరిగిన గ్యాంగ్ రేప్ పార్లమెంట్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలల క్రితం 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ కదులుతున్న బస్ లో గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన దేశ ప్రజలను కలిచివేసింది. దక్షిణ ఢిల్లిలో మునిర్కా ప్రాంతోలో తన స్నేహితుడితో కలిసి బస్ లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిర్భయ డిసెంబర్ 29 తేదిన తుది శ్వాస విడిచింది. దాంతో దేశ ప్రజలందరూ విషాదం మునిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు మరణ శిక్ష విధించాలని దేశంలోని అత్యధిక ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది.

నిర్భయ కేసులో 2013 జనవరి 3 తేదిన చార్జిషీట్ దాఖలు కాగా, విచారణ ఫిబ్రవరి 5 తేదిన ప్రారంభించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను, డిఫెన్స్ 17 మందిని విచారించారు. ఈ కేసులో మరో ముద్దాయి రాంసింగ్ తీహార్ జైల్లో ఉరి వేసుకుని మరణించడంతో కేసు నుంచి తప్పించారు.  అయితే మిగిలిన ముద్దాయిలు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ల భవితవ్యాన్ని ఢిల్లీ కోర్టు ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా మంగళవారం తేల్చనున్నారు.

ఈ కేసులో నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, హత్యాప్రయత్నం, సాక్షాలను మాయం చేయడం, దోపిడితోపాటు ఇతర నేరాలను   నలుగురు నిందితులపై మోపారు. ఈ కేసులో సాక్ష్యాలు రుజువైతే వీరికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో మైనర్ గా ఉన్న నిందితుడిని ఆగస్గు 31 తేదిన జువెనైల్ జస్టిస్ బోర్డు కు పంపారు. అయితే మైనర్ బాలుడికి విధించిన శిక్షపై బాధిత కుటుంబం ఆందోళన, నిరసనను వ్యక్తం చేశారు. మైనర్ నిందితుడిని కూడా కఠినంగా శిక్షించాలని నిర్భయ కుటుంబం డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు