నోట్ల రద్దుతో 'రసగుల్ల' మల్లగుల్లాలు

19 Nov, 2016 14:02 IST|Sakshi

కోలకత్తా:  బెంగాల్ అంటే స్వీట్లకు పెట్టింది పేరు. కానీ డీమానిటేజేషన్ ప్రభావంతో  బెంగాల్ తీపి వంటకాలు చేదెక్కుతున్నాయి.   ప్రధానంగా బెంగాలీ స్వీట్ గా   పేరొందిన రసగుల్లా అమ్మకాలపై వేటు పడింది. రూ.500 నుంచి రూ .1,000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ  కేంద్ర  నిర్ణయం తమ స్వీట్ల అమ్మకాలపై భారీగా పడిందని పశ్చిమ బెంగాల్  స్వీట్ వర్తకం దారులు వాపోతున్నారు.   ముఖ్యంగా కార్తీక పూజ సందర్భంగా  ఏడాదికి సరిపడా ఆదాయం వచ్చే స్వీట్ల అమ్మకాలు  భారీగా  పడిపోవడం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందన్నారు.  స్థానిక వర్తకులు సమాచారం  ప్రకారం ఇక్కడ ఏడాదికి లక్షకోట్ల రూపాయల స్వీట్ల వ్యాపారం జరుగుతుంది.

పెద్ద నోట్ల రద్దుతో రోజుకి నాలుగు నుంచి పదివేలరూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయని హౌరాకు చెందిన గంధేశ్వరీ స్వీట్స్  యజమాని ప్రదీప్ హాల్దర్ చెప్పారు.  అలాగే  రసగుల్లాను పరిచయం చేసిన  ధిమాన్ దాస్ కంపెనీ కూడా ప్రస్తుతం తయారీని  నిలిపివేసే స్థితికి వచ్చింది.  ఎపుడూ భారీ డిమాండ్ ఉండే తమ రసగుల్లా , సందేష్ లకు  ప్రస్తుతం  డిమాండ్ 30శాతం పడిపోయందని  కంపెనీ  యజమాని కేసీ దాస్ తెలిపారు.  దీంతో పురాతన స్వీట్ షాప్ లోఉత్పత్తిని  ఒక రోజు  నిలిపివేసినట్టు చెప్పారు.   ముఖ్యంగా డెబిట్ కార్డు ఆప్షన్ లేని వీధి వ్యాపారులు భారీగా నష్టపోతున్నారన్నారు.   దీనికి తోడు చక్కెర లాంటి ఇతర ముడి పదార్థాలు  అందించే విక్రయదారులు  పాత నోట్లను  అంగీకరించమని తెగేసి చెప్పడం మరింత ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు.   ఇటు పాత నోట్ల చలామణిలేక, అటు కొత్త నోట్లు అందుబాటులోకి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అయితే కొంతమంది నమ్మకస్తులైన కస్టమర్లకు  తరువాత చెల్లించే పద్ధతిలో స్వీట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రూ.100 ల స్వీట్స్ కోసం రూ. 2 వేల నోటు ఇవ్వడంతో చిల్లర కష్టాలు తప్పడంలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. తమ వ్యాపార నిర్వహణ  ఎలాగో అర్థం కావడంలేదన్నారు.   కొత్త నోట్ల కొరతతో  సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు అమ్మకాలు బాగా పెరిగినా.. అందరికీ డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపుల అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా వీధి వ్యాపారులు బాగా నష్టపోతున్నట్టు  చెప్పారు. 
 కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన  'ఆపరేషన్ బ్లాక్ మనీ' ని రాష్ట్రంలోని  స్వీట్ వ్యాపారులు కొంతమంది  ప్రశంసిస్తున్నారు. కొంతకాలం తమకు ఈ కష్టలు తప్పవు అంటూ సరిపెట్టుకోవడం విశేషం.
 

మరిన్ని వార్తలు