పురోగతి లేని ‘అనూహ్య’ కేసు

21 Jan, 2014 01:08 IST|Sakshi
పురోగతి లేని ‘అనూహ్య’ కేసు

సాక్షి, ముంబై: అనూహ్య అదృశ్యమైంది ఈనెల 5న.. శవమై తేలింది 11 రోజుల తర్వాత.. ఇప్పుడు మరో ఐదు రోజులు గడిచిపోయాయి. అయినా ఈ హత్య కేసులో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు. హత్యకు పాల్పడ్డవారిని పట్టుకోవడం కాదు కదా.. వారికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు. ఓవైపు రైల్వే పోలీసులు.. మరోవైపు కంజూర్ మార్గ్ పోలీసులు.. ఇంకోవైపు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నా మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోతున్నారు. మృతదేహం లభిం చిన ఐదు రోజుల తర్వాత అనూహ్య పాదరక్షలు, దుప్పటిని గుర్తించారు. ఆమె మృతదేహం లభించిన చోటు నుంచి సుమా రు కిలోమీటరు దూరంలో ఈ వస్తువులు ఆదివారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

యువతి స్నేహితుడు హేమంత్‌పై ఇంకా ఆరా తీస్తున్నారు. ఆమె ముంబైలో దిగిన రోజు హేమంత్ సెల్‌ఫోన్ షిర్డీలో ట్రేస్ అయిందని, తర్వాత అతను హైదరాబాద్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అనూహ్య మృతదేహం బయటపడ్డ కం జూర్‌మార్గ్ ప్రాంతంలో సోమవారం ‘సాక్షి’ పర్యటించింది. అనూహ్య కేసు దర్యాప్తు చేస్తున్న కంజూర్ మార్గ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ నిశికాంత్ తుంగారేతోపాటు స్థానికులను కేసు గురించి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
 
 సాక్షి పరిశీలనలో వెల్లడైన విషయాలివీ..
 -   అనూహ్య భౌతికకాయం లభించిన ప్రాంతం కంజూర్ మార్గ్ పోలీస్ స్టేషన్  నుంచి  సుమారు ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉంది.
 -    ఈ ప్రాంతాన్ని కంజూర్-భాండూప్‌గా చెప్పుకుంటారు. కొందరు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ నివసిస్తున్నారు.
 -    ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన నిర్మానుష్యంగా ఉన్న చెట్లపొదల్లో అనూహ్య శవం దొరికింది. ఇక్కడ ఆకతాయిలు, నేరచరిత్ర కలిగినవారు మద్యం తాగుతుంటారు. అప్పుడప్పుడు అక్కడ గొడవలు జరిగేవి.
 -   ఈ ప్రాంతం గురించి తెలిసినవారే అనూహ్యను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉండొచ్చని అనుమానం.

>
మరిన్ని వార్తలు