మోదీకి ఫోన్‌ చేసిన ట్రంప్‌..

28 Mar, 2017 00:17 IST|Sakshi
మోదీకి ఫోన్‌ చేసిన ట్రంప్‌..

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోదీ పార్టీ(బీజేపీ) అద్భుత విజయాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ట్రంప్‌.. ప్రధానికి శుభాకాంక్షలు చెప్పినట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ సోమవారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తూ, ఆందోళనకర అంశంగా మారిన జాత్యహంకార దాడులపై ఇరు నేతలు చర్చించింది, లేనిది తెలియాల్సిఉంది.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటలకే ట్రంప్‌ మొదటిసారి మోదీతో మాట్లాడారు. అనంతరం రెండుమూడు సందర్భాల్లో వివిధ అంశాలపై ఫోన్‌లోనే చర్చలు జరిపారు. అయితే తొలిసారి భారత అంతర్గత రాజకీయాల(ఎన్నికల్లో విజయం)పై ట్రంప్‌ మాట్లాడటం విశేషం. అందుకే ఈ ఫోన్‌ కాల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, జర్మనీలో జరిగిన తాజా ఎన్నికల్లోనూ జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ నేతృత్వంలోని క్రిస్టియన్‌ డెమొక్రాట్స్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెర్కెల్‌కు కూడా ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు