డాక్టర్ రెడ్డీస్ నుంచి ఆప్టిడోజ్

11 Jan, 2014 00:34 IST|Sakshi
డాక్టర్ రెడ్డీస్ నుంచి ఆప్టిడోజ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  అధిక రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించే కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ‘ఆప్టిడోజ్’ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అమ్లోడైపిన్ 2.5 ఎంజీ. టెల్మిసర్టన్ 200ఎంజి, హైడ్రోక్లోరోథిజైడ్ 6.25 ఎంజీ కాంబినేషన్‌లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్  పది ట్యాబ్లెట్స్ ధరను రూ.80గా నిర్ణయించినట్లు డాక్టర్ రెడ్డీస్ ఇండియా జనరిక్ హెడ్ అలోక్ సోని తెలిపారు. శుక్రవారం ఆప్టిడోజ్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం సోని మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఆదాయంలో 25 నుంచి 30% హృదయ సంబంధిత విభాగం నుంచే సమకూరుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ మూడు కాంబినేషన్లు వాడే వారు మోతాదును బట్టి ట్యాబ్లెట్‌కు రూ.12 నుంచి రూ.18 వరకు వ్యయం చేయాల్సి వచ్చేదని, కాని ఇప్పుడు మూడు కాంబినేషన్లు కలిపి రూ.8 కే అందిస్తున్నట్లు తెలిపారు.
 
 10 శాతం వృద్ధి: ఈ ఏడాది వ్యాపారంలో 8-10% వృద్ధి నమోదుకావచ్చని అలోక్ తెలిపారు. కొత్త ఔషధ విధానంతో ధరలు తగ్గడం, ఆర్థిక మందగమనం వంటి కారణాలతో ఈ ఏడాది దేశీయ ఫార్మా రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. తప్పనిసరి ఔషధాలపై ధరలను నియంత్రిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ తీసుకున్న నిర్ణయం కంపెనీకి చెందిన 15-20 డ్రగ్స్‌పైపడుతుందని, ఇది ఆదాయంపై 5% వరకు ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

>
మరిన్ని వార్తలు