-

అమెరికాలో మహానేతకు స్మృత్యంజలి

4 Sep, 2016 23:12 IST|Sakshi

- గ్రేట్ వైఎస్సార్ కు వైఎస్సార్సీపీ బోస్టన్ శాఖ, అభిమానుల ఘన నివాళి

బోస్టన్:
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడవ వర్ధంతిని అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బోస్టన్ శాఖ  ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న బోస్టన్ (మాసాచుసెట్స్) నగరంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ సభ్యులతోపాటు వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పెద్దాయనను గురించిన అనుభూతులను గుర్తుచేసుకున్నారు.

మయూరి ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బోస్టన్ కన్వినర్ వెన్నం శివరామిరెడ్డి, వైఎస్సార్ వీరాభిమానులు నాగిరెడ్డి, రామిరెడ్డి, రామాంజనేయులు, సురేశ్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఏపీలో పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ అమెరికా మరో కన్వీనర్ రత్నకుమార్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేదల, రైతుల, రాష్ట్ర అభ్యున్నతి కోసం వైఎస్సార్ అమలుచేసిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను, వాటి ద్వారా జరిగిన మేళ్లను ప్రసంగీకులు గుర్తుచేశారు. వైఎస్సార్.. ప్రజల హృదయాల్లో కలకాలం గుర్తుండిపోయే మహానేత అని కీర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సభకు వివరించిన బొత్స.. త్వరలోనే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రియతమనేత ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చుతుందని చెప్పారు. మహానేత వారసుడిగా ఆయన గుణగణాలను పునికిపుచ్చుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా మద్దతు పలుకుతామని సభికులంతా ముక్తకంఠంతో నినదించారు.

మరిన్ని వార్తలు