న్యూఢిల్లీ: మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.5,600 కోట్ల చెల్లింపుల వైఫల్యం కేసులో దర్యాప్తు కు సహకరించడంలేదని ఆరోపిస్తూ ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. యాంటి మనీ లాండరింగ్ స్పెషల్ కోర్టుముందు బుధవారం జిగ్నేష్ ను ప్రవేశపెడతామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ నిందితుల అటాచ్మెంట్ ఆస్తుల అమ్మకానికి సిద్ధమవుతున్ననేపథ్యంలో.. సమగ్ర సమాచారాన్ని అందివ్వాల్సి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ అధ్యక్షతన గత నెలలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈడీ ఎటాచ్ చేసిన రూ. 6, 116 కోట్ల విలువైన ఆస్తులను త్వరగా వేలం వేసి ఇన్వెస్టర్లకు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఎఫ్టీఐఎల్ సంస్థ స్పందిస్తూ ..షా పూర్తిగా విచారణ అధికారులతో సహకరిస్తున్నా...ఈడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడంలేదని పేర్కొంది. మరోవైపు జిగ్నేష్ షా అరెస్టుతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా షేర్లు దాదాపు 6 శాతంనష్టాల్లో ట్రేడవుతున్నాయి.
కాగా ఎన్ఎస్ఈఎల్ సహా మరో 67 మంది ఇతర సభ్యులపై 20వేల పేజీల చార్జ్ షీటును ఈడీ ముంబైకోర్టు ముందుంచింది. సంస్థ నిధులను చట్టవిరుద్ధంగా కాజేసి, ప్రయివేటుఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించింది. సుమారు 13 వేల మంది పెట్టుబడిదారులకు చెందిన కోట్ల రూపాయలను నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) అధికార్లు స్వాహా చేశారని ఎఫ్ టీఐఎల్ ఆరోపిస్తోంది. ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) తో పాటు, కేసు దర్యాప్తు చేసేందుకు 2013 లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది. గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.