'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి'

22 Oct, 2016 12:13 IST|Sakshi
'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి'

ముంబై: వివాదాలే ఊపిరిగా మహారాష్ట్రలో మనుగడ సాగిస్తోన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కనీవినీ ఎరుగని డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ లతో భేటీలో పాల్గొన్న ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. (సినిమా రంగంలో కీలక పరిణామం)

పాకిస్థానీ నటులతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క నిర్మాత రూ.5కోట్లను సైనిక సహాయ నిధి(ఆర్మీ రిలీఫ్ ఫండ్)కి ఇవ్వాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలందరూ తప్పక అంగీకరించాలని, రూ.5కోట్లు ఇచ్చేందుకు నోటిమాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాదు, భారతీయ నిర్మాతలెవ్వరూ పాకిస్థానీ నటీనటులను సినిమాల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఠాక్రే హెచ్చరించారు. ఉడీ ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఎంఎన్ఎస్.. పలు నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్ల మద్దతుసైతం కూడగట్టిన సంగతి తెలిసిందే.

ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడంతోపాటు భవిష్యత్ లోపాక్ నటులను తీసుకోబోమన్న హామీపై 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. సీఎం ఫడ్నవిస్ సమక్షంలో దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ఒప్పందానికి తలొగ్గారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28న ఆ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు