ఆ జింకలను ఎవరు చంపారు?

25 Jul, 2016 12:22 IST|Sakshi
ఆ జింకలను ఎవరు చంపారు?

సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు..  

  • 1998 సంవత్సరంలో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ సినిమా నటులైన సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు సరదా కోసం వేటకు వెళ్లారని,  రక్షిత వన్యప్రాణులైన జింకలను వేటాడారని అప్పట్లో కేసు నమోదైంది. జోథ్ పూర్ శివార్లలోని భవాద్ అటవీ ప్రాంతంలో 1998 సెప్టెంబర్ 26న ఓ జింక, సెప్టెంబర్ 28న ఘోడా ఫార్మ్ హౌస్ లో మరో జింక హత్యకు గురయ్యాయి.  

     
  •  ఈ జింకలను వేటాడి చంపిన కేసులో 2006లో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ఖాన్కు ఐదేళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శిక్షపై స్టే విధించింది. అనంతరం సుదీర్ఘకాలం వాదనల అనంతరం సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది.
     
  • జింకలను వెటాడిన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై స్థానిక బిష్ణోయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ వర్గం తెలిపింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది.

     
  • న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తోందో సెలబ్రిటీ కేసులే మనకు చెప్తాయి. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని చెప్పడానికి కోర్టుకు 20 ఏళ్లు పట్టడం నిజంగా భయం కలిగిస్తున్నది- రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో..
మరిన్ని వార్తలు