శ్రీనగర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా విజయం

15 Apr, 2017 16:08 IST|Sakshi
శ్రీనగర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా విజయం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా విజయం సాధించారు. అబ్దుల్లా తన సమీప ప్రత్యర్థి, అధికార పీడీపీ అభ్యర్థి నాజిర్‌ అహ్మద్‌ఖాన్‌ను 10 వేల పైచిలుకు ఓట‍్ల తేడాతో ఓడించారు. కౌటింగ్‌ ప్రారంభం నుంచి ముందంజలో ఉన్న అబ్దుల్లా అదే జోరు కొనసాగించి విజయకేతనం ఎగురవేశారు.

హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పీడీపీ నేత తారిఖ్‌ హమీద్‌ శ్రీనగర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన ఈ ఉపఎన్నికలో మొత్తం తొమ్మిదిమంది అభర్థులు పోటీపడ్డారు. వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల సందర్భంగా భారీగా హింస చెలరేగడంతో అధికారులు ఏప్రిల్‌ 13న 38 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కౌంటింగ్‌ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
 

మరిన్ని వార్తలు