మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లూ మింత్రాకు గుడ్బై

16 Aug, 2016 10:41 IST|Sakshi

బెంగళూరు : ఫ్యాషన్ పోర్టల్ మింత్రా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నిష్క్రమణకు సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్ టీమ్ను పునర్నిర్మించుకునే క్రమంలో ఈ మేరకు సన్నద్దమవుతోంది. మింత్రా పేరెంట్ కంపెనీ ఫ్లిప్కార్ట్,  ప్రధాన ప్రత్యర్థి జబాంగ్ను సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ కొనుగోలు అనంతరం వ్యాపార వృద్ధిని మరింత పెంచుకోవడానికి మింత్రా తీవ్రంగా కృషిచేస్తోంది. అయితే మింత్రా వాణిజ్యానికి అధినేతలుగా ఉన్న ప్రసాద్ కోంపల్లి, అభిషేక్ వర్మలు కంపెనీ నుంచి వైదొలిగే ప్రక్రియలో ఉన్నట్టు.. వారి నిష్క్రమణకు కూడా కంపెనీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

గతనెలలోనే  మింత్రాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న గౌతమ్ కోటంరాజ్ రాజీనామా చేసి, అమెజాన్ ఇండియాలో చేరారు. అదేవిధంగా కంపెనీ ఫైనాన్స్లను పర్యవేక్షించే ప్రభాకర్ సుందర్ సైతం మింత్రాకు గుడ్బై చెప్పి, మరో ప్రత్యర్థి ఫ్యాషన్ పోర్టల్ వోనిక్లో జాయిన్ అయ్యారు. కోంపల్లి అక్టోబర్ నుంచి అడ్వయిజరీ పాత్రను పోషించబోతున్నారని, అతని వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి సమయాన్ని కేటాయించడానికి ఆయన కంపెనీ నుంచి వైదొలగబోతున్నారని మింత్రా అధికారిక ప్రతినిధి చెప్పారు. అడ్వయిజరీగా కోంపల్లి కంపెనీ సీఈవో అనంత్ నారాయణన్కు వివిధ అంశాల్లో దగ్గరుండి సలహాలు అందిస్తారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందునుంచి వీరిద్దరూ నారాయణన్ ఆలోచనలకు చాలా దగ్గరుగా నిర్ణయాలు తీసుకునేవారని, క్లోజ్గా కంపెనీ వ్యవహారాలు నిర్వహించేవారని చెబుతున్నారు.

నాలుగేళ్ల కాలంలో కోంపల్లి మార్కెటింగ్, కొనుగోలు వ్యవహారాలు, సామాగ్రి, బ్రాండ్ భాగస్వామ్యం, డిజిటల్, మొబైల్ ప్లాట్ఫామ్ల వ్యవహారాలను చూసుకునేవారు. రీటైల్ ఇండస్ట్రిలో ఓ సీనియర్ లీడర్ను అభిషేక్ వర్మ స్థానంలో మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్కు కొత్త అధినేతను సెప్టెంబర్లో నియమించబోతున్నట్టు తెలుస్తోంది. క్రాస్ ఇండస్ట్రిలో అనుభవం కలిగిన వారిని టాప్ మేనేజ్మెంట్లో నియమించుకుంటామని కంపెనీ చెప్పింది. జబాంగ్ను తన పేరెంట్ కంపెనీ సొంతం చేసుకున్న అనంతరం మేనేజ్మెంట్ టీమ్ను బలపర్చుకుంటూ వృద్ధి బాటలో పయనించడానికి కృషిచేస్తున్నట్టు మింత్రా తెలుపుతోంది.
 

>
మరిన్ని వార్తలు