బ్రేకింగ్‌: బీజేపీ గూటికి మాజీ సీఎం!

4 Feb, 2017 10:50 IST|Sakshi
బీజేపీ గూటికి సీనియర్‌ నేత, మాజీ సీఎం!

బెంగళూరు: ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన అత్యంత సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. ఎస్‌ఎం కృష్ణ త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలిపారు.

ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని, అయితే ఆయన ఎప్పుడు చేరుతారనే తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. కానీ, ఎస్‌ఎం కృష్ణ బీజేపీలో చేరడం 100శాతం ఖాయమని స్పష్టం చేశారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ గతవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింట్‌ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖను పంపారు. కర్ణాటకలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతగా మంచి పేరున్న ఎస్‌ఎం కృష్ణ కాంగ్రెస్‌ను వీడటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నదని చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకొని.. విశ్రాంత జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి కూడా. అయితే, ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌ఎం కృష్ణ చేరిక తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు