ఫ్రెషర్స్ వేతన ప్యాకేజీపై సర్వే ఏం చెప్పిందంటే....

3 Jan, 2017 19:02 IST|Sakshi
కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి(ఫ్రెషర్స్) వేతన ప్యాకేజీ గతేడాది కంటే 2016లో భారీగా పెరిగిందట. వార్షిక వేతనం కింద ఆరు లక్షల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీనే చాలా ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని, ఈ వృద్ధి 85 శాతం ఉందని తాజా సర్వేలు తేల్చాయి. ఉద్యోగ అంచనా సంస్థ యాస్పైరింగ్ మైండ్స్, ఫ్రెషర్ జాబ్స్ పోర్టల్ మ్యామ్క్యాట్.కామ్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.  ఉద్యోగులకు(0 నుంచి 2 ఏళ్ల అనుభవం ఉన్న) ఆఫర్ చేసే వేతనాలు వార్షికంగా రూ.1-30 లక్షల మధ్యలో ఉంటాయని, వాటిలో చాలా వేతనాలు వార్షికంగా రూ.2-3 లక్షల రేంజ్లోనే ఉంటాయని సర్వే పేర్కొంది. అయితే వేతన ప్యాకేజీ రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఆఫర్ చేసే ఉద్యోగాలు 2015 నుంచి 85 శాతం పెరిగాయని తాజా సర్వే వెల్లడించింది.
 
దేశవ్యాప్తంగా 6వేల ఉద్యోగాల్లో పోస్ట్ అయిన 40 లక్షల జాబ్ అప్లికేషన్లపై ఈ సర్వే నిర్వహించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్ రోల్ సాప్ట్వేర్ అప్లికేషన్స్ అని, దీనికి సుమారు 38 శాతం జాబ్ అప్లికేషన్లు నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. ఫ్రెషర్స్లో రెండో టాప్ జాబ్ మార్కెటింగ్, సేల్స్ అని వెల్లడైంది. మార్కెటింగ్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా పాపులర్ జాబ్గా ఉందని తెలిసింది.  డేటా అనాలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్లకు యేటికేటికి 30 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందట. టెక్నికల్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ డెవలపర్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో డిజిటల్ మార్కెటింగ్లు అత్యంత ప్రాముఖ్యమైన జాబ్ కేటగిరీల్లో అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయని యాస్పైరింగ్ మైండ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హిమాన్షు అగర్వాల్ చెప్పారు.   
మరిన్ని వార్తలు