ఛైర్మన్గా ఆయనే కొనసాగుతారు

30 Sep, 2015 12:25 IST|Sakshi
ఛైర్మన్గా ఆయనే కొనసాగుతారు

న్యూఢిల్లీ:  ఎఫ్ టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ నియాకమంలో చివరకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. దాదాపు మూడు నెలల పాటు విద్యార్థుల నిరసనను ఎదుర్కొన్న గజేంద్ర చౌహాన్ను పదవిలో కొనసాగింవచడంలో విజయం సాధించింది. విద్యార్ధి సంఘాల నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో దీనిపై ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విద్యార్థుల సమస్యపై చర్చిస్తామన్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హామీతో దీక్ష విరమించిన విద్యార్థులు కేంద్రం ప్రతిపాదించిన మధ్యే మార్గానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.   

విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనకు కారణమైన సంస్థ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ మాత్రం యథావిధిగా  ఆ పదవిలో కొనసాగుతారు. చౌహాన్తో పాటుగా ఒక కో చైర్మన్ ను నియమించేలా  కేంద్రం ప్రతిపాదించింది. విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నఐదుగురు సభ్యులను కమిటీ నుంచి తొలగించేందుకు అంగీకరించింది. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనకు విద్యార్థి సంఘ నాయకులు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ఛైర్మన్ గా చౌహాన్ కొనసాగుతారని పేరుచెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి మీడియాకు వివరించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి  తీసుకుని కొన్ని నిర్ణయాలు  తీసుకున్నామన్నారు.  తమ ప్రతిపాదనకు  విద్యార్థిసంఘ నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

గత జూన్ లో ఎఫ్ టీఐఐ చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ ను నియమించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతిష్ఠాత్మక ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజకీయాలకు చోటు లేదని.. బీజేపీకి చెందిన గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు పలువురు సినీ ప్రమఖులు, రాజకీయ నాయకులు తమ మద్దుతును తెలిపారు. ఈ నేపథ్యంలో  సెప్టెంబర్ 29న చర్చలకు రావాలని విద్యార్ధి సంఘాల నాయకులను కేంద్రం ఆహ్వానించడంతో దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు