ఐసీయూలో పేషెంట్లను వదిలేసి.. డాన్సులు!

20 Oct, 2015 15:28 IST|Sakshi
ఐసీయూలో పేషెంట్లను వదిలేసి.. డాన్సులు!

ఐసీయూలో ఎవరినైనా చేర్చారంటే.. వాళ్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అర్థం. అలాంటిచోట్ల రోగులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాంటిది, అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రోగులను గాలికి వదిలేసి నర్సులు, ఇతర సిబ్బంది గార్బా డాన్సులు వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది పెద్ద సౌండుతో మ్యూజిక్ పెట్టుకుని మరీ డాన్సులు చేశారు. గుజరాత్ వైద్యవిద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్ ఆ ఆస్పత్రిలో కొత్త డయాలసిస్ సెంటర్ ప్రారంభించి వెళ్లిన కొద్దిసేపటికే ఇదంతా జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగానే పెద్ద సౌండుతో పాటలు పెట్టుకుని డాన్సులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐసీయూలో, అది కూడా పేషెంట్లను గాలికి వదిలేసి ఇలా డాన్సులు చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే, అసలు డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తాము ఎలాంటి గార్బా డాన్సు ముందుగా ప్లాన్ చేయలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హెచ్‌కే భవ్సర్ తెలిపారు. కొందరు నర్సులు, బోయ్‌లు, పేషెంట్లు కలిసి ఆ కార్యక్రమం అయిపోయాక డాన్సులు చేశారని, తమకు విషయం తెలియగానే దాన్ని ఆపించామని ఆయన చెప్పారు. ఇలా జరిగి ఉండకూడదని, బాధ్యులందరికీ నోటీసులు ఇస్తున్నామని అన్నారు.

>
మరిన్ని వార్తలు