భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?

11 Oct, 2016 15:49 IST|Sakshi
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?

ముంబై: ఆయిల్ ధరలు పుంజుకోవడంతో దేశంలో మరోసారి పెట్రో వడ్డనే తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.   అంతర్జాతీయ చమురు ధరలు  గణనీయంగా పెరగడంతో  పెట్రోల్ ధరలు పెరగొచ్చనే అంచనా మార్కెట్ వర్గాల్లో నెలకొంది.  ఈ మాసాంతంలో జరిగే సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  పెట్రోల్,  డీజిల్ భారీగానే పెంచే అవకాశం ఉందని  భావిస్తున్నాయి. ఈ  ఏడాది గరిష్ఠ స్థాయిని తాకడం, ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ఇటీవల ప్రధాన ఆయిల్ ఉత్పత్తిదారులు అల్జీరియా అంగీకారం  నేపథ్యంలో ఈ అంచనాలు నెలకొన్నాయి.  అటు చమురు ధరల క్షీణతను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తిని తగ్గించే దిశగా నాన్ ఒపెక్ దేశాలు కూడా  సంకేతాలు ఇవ్వడంతో   బ్రెంట్‌ నార్త్‌ సీ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర సోమవారం 53.45 డాలర్లను తాకింది.

సాధారణంగా  రెండు వారాలకు ఒకసారి  అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం రంగ ఇంధనసంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి),   భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోని పెట్రోల్,డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. వివిధ ప్రభుత్వ సుంకాలు ,అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి విలువ, చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు ఆధారంగా ఇది ఉంటుంది.

కాగా  గతరెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఆయిల్ ధరలు ఒపెక్ దేశాల సంచలన నిర్ణయంతో భారీగా పుంజుకున్నాయి. గత ఎనిమిదేళ్లో మొదటి సారి  గత నెలలో జరిగిన ఒప్పందంతో  చమురు ధరలు దాదాపు 15 శాతం  పెరిగాయి.  ఫిబ్రవరి  బ్యారెల్30 డాలర్లకు దిగజారి 12 ఏళ్ల కనిష్టాన్ని నమోదుచేసిన ధరలు కీలక మద్దతు  స్థాయిని 50 డాలర్లను అధిగమించాయి.   మరోవైపు  ఇస్తాంబుల్‌లో నిర్వహించిన  వరల్డ్‌ ఎనర్జీ కాంగ్రెస్ లో రష్యా అధ్యక్షుడు  పుతిన్‌ తాము కూడా ఉత్పత్తిని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.  ఇప్పుడున్న స్థాయిలోనే ఉంటే భవిష్యత్తులో ఆ రంగానికి నిధులు అందించడం  కష్టతరమన్న ఆయన  ఇతర ఒపెక్‌ దేశాలు కూడా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.  పెట్రోలియం ఎగుమతి దేశాల తదుపరం  సమావేశం  నవంబర్ 30 న వియన్నా లో జరగనుంది.
 

>
మరిన్ని వార్తలు