ముంబై: రొమ్ము క్యాన్సర్ ఔషధానికి(టైకర్బ్) సంబంధించి గ్లాక్సోస్మిత్లైన్ ఫార్మా కంపెనీ పేటెంట్ను ద ఇంటలెక్చువల్ ప్రోపర్టీ అప్పిలేట్ బోర్డ్ (ఐపీఏబీ) ఉపసంహరించింది. అయితే టైకర్బ్కు యాక్టివ్ ఇన్గ్రెడియంట్గా ఉన్న లాపటినిబ్ కాంపౌండ్కు పేటెంట్ను మాత్రం కొనసాగిస్తున్నామని పేర్కొంది. ఫ్రెసినియస్ కాబి ఆంకాలజీ కంపెనీ దాఖలు చేసిన ఫిర్యాదులపై పేటెంట్ అప్పీల్స్ ఏజెన్సీ చెన్నై బెంచ్ చైర్పర్సన్ జస్టిస్ ప్రభ శ్రీదేవన్ గత నెల 27న ఈ రూలింగ్ను ఇచ్చారు. టైకర్బ్ పేటెంట్ను ఐపీఏబీ ఉపసంహరించుకోవడం నిరాశకు గురి చేసిందని జీఎస్కే ఫార్మా ఇండియా కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తీర్పు భారత్కే పరిమితమని, ఇతర దేశాల్లో టైకర్బ్ పేటెంట్లకు ఇది వర్తించదని వివరించారు. ఐపీఏబీ నిర్ణయాన్ని అధ్యయనం చేస్తున్నామని ఈ మెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. లాపటినిబ్ కాంపౌండ్కు పేటెంట్ కొనసాగింపు పట్ల ఆ ప్రతినిధి సంతోషం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా ఈ టైకర్బ్ ఔషధం భారత మహిళలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోందని వివరించారు.