హైకోర్టులకు ‘రిటైర్డు జడ్జీలు’

5 Nov, 2016 00:34 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా రిటైర్డు జడ్జీల సేవలను హైకోర్టుల్లో వినియోగించుకునేందుకు కేంద్రం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని ఓ విశిష్ట నిబంధనను అమల్లోకి తీసుకురానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224 (ఏ) ప్రకారం.. కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు వీటిని త్వరిత గతిన పరిష్కరించేందుకు గతంలో  హైకోర్టుల్లో జడ్జీలుగా పనిచేసి రిటైరైన వారిని తిరిగి జడ్జీలుగా నియమించుకునే అవకాశం ఉంది.
 
  ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో జడ్జీగా పనిచేసిన వారిని మళ్లీ బాధ్యతలు తీసుకొమ్మని కోరవచ్చు. ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగిన సీఎంల, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల భేటీలో చర్చ  జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు మినిట్స్ సిద్ధం చేసినప్పటికీ.. ఇందులో కొన్ని స్పష్టమైన నిర్ణయాలపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.కొత్తగా న్యాయశాఖ బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ప్రసాద్ ఈ మినిట్స్‌ను కొద్ది రోజుల క్రితమే ఆమోదించి పంపించారు. జడ్జీల ఎంపికపై ఉమ్మడి నిర్ణయానికి వచ్చేందుకు శాసన, న్యాయవ్యవస్థల మధ్య చర్చలు జరుగుతున్న ఈ సమయంలో మినిట్స్‌కు ఆమోదం తెలపటంతో.. కొలీజియంపై ప్రతిష్టంభన తొలగే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు