‘టోలు’ తీసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్

8 Dec, 2016 19:37 IST|Sakshi
‘టోలు’ తీసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్

సాక్షి, అమరావతి: రోడ్డెక్కితే చాలు ‘టోలు’ తీసేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లను దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ రోడ్డువిస్తరణ కోసం పీపీపీ (ప్రభుత్వ-ప్రై వేటు భాగస్వామ్యం) ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. మొత్తం 32 రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు రూ.8,182 కోట్లతో ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో పీపీపీ ప్రాజెక్టుల కింద గుంటూరు-బాపట్ల, విజయనగరం-పాలకొండ రహదారులకుగాను రూ.1,462 కోట్లతో ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది.

దీంతో గురువారం ఈ రెండు రహదారులకు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ జీవో జారీ చేశారు. టోల్ ప్లస్ యాన్యుటీ విధానంలో ఈ రెండు రహదారులకు అనుమతులిచ్చారు. గుంటూరు-బాపట్ల నాలుగు లేన్ల రహదారికి రూ.849 కోట్లు, విజయనగరం-పాలకొండ రెండు/నాలుగు లేన్ల రహదారికి రూ.613 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గుంటూరు-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.571 కోట్లు కాగా, భూ సేకరణకు రూ.207 కోట్లు, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూ.46 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.25 కోట్లు కేటాయించారు. విజయనగరం-బాపట్ల రహదారికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.434 కోట్లు.. ఇందులో సివిల్ కనస్ట్రక్షన్ ఖర్చు రూ.347.87 కోట్లు కాగా, భూమి సూకరణకు రూ.126 కోట్లు, బదలాయింపు కార్యక్రమాలకు రూ.17.39 కోట్లు, కిలోమీటరుకు సివిల్ వర్కు వ్యయం రూ.4.73 కోట్లు చొప్పున కేటాయించారు.

మరిన్ని వార్తలు