ఇదో వెరైటీ పెళ్లి!

18 Feb, 2015 09:30 IST|Sakshi
ఇదో వెరైటీ పెళ్లి!

రాంపూర్: హీరోయిన్ కు పెళ్లి కుదురుతుంది. తర్వాత ఆమె హీరోతో ప్రేమలో పడి చివరి అతడినే పెళ్లాడుతోంది. ఇలాంటి సినిమాలు చాలానే చూసేవుంటారు. అయితే సినిమాకు ఏమాత్రం తీసిపోని వెరైటీ పెళ్లి ఉత్తప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది. అసలు ఏం జరిగిందంటే...

మొర్దాబాద్ కు చెందిన జుగల్ కిశోర్(23), రాంపూర్ కు చెందిన ఇందిర(23)తో పెళ్లి కుదిరింది. 'వరమాల' కార్యక్రమం వరకు పెళ్లితంతు సవ్యంగానే సాగింది. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. మూర్ఛరోగంతో బాధపడుతున్న కిశోర్ వధువుకు వరమాల వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వరుడుకు ఉన్న రోగాన్ని దాచిపెట్టిన పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మోసం చేసిన వరుడికి బుద్ధి చెప్పేందుకు అదే పెళ్లి పందిరిలో మరొకరిని పెళ్లాడింది. తన వివాహానికి అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ అనే యువకుడిని వరించింది. హర్పాల్ మొదట ఆశ్చర్యానికి గురైనా తర్వాత అంగీకరించాడు. ఇక ఆలస్యంగా చేయకుండా ఇందిర, హర్పాల్ అక్కడిక్కడే దండలు మార్చుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఏడు అడుగులు నడిచారు.

అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిశోర్ ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అతడు వెంటనే కోలుకుని తిరిగొచ్చేప్పటికి ఇందిర మరొకరి భార్య అయింది. కిశోర్ బతిమాలినా, భయపెట్టిన ఇందిర నిబ్బరంగానే ఉంది. మనసు మాత్రం మార్చుకోలేదు. చేసేది లేక స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో పెళ్లి కథ సుఖాంతమైంది.

మరిన్ని వార్తలు