గ్రూప్ డీ, సీ, బీ పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి

26 Oct, 2015 02:14 IST|Sakshi
గ్రూప్ డీ, సీ, బీ పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి

వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన
 
♦ శాంతి, సామరస్యాలే ప్రగతి చక్రాలు   అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి
♦ స్వచ్ఛ భారత్‌లో మీడియా కృషి ప్రశంసనీయం   అవయవ దానం మహాదానం
♦ ఆపన్నులకు అవయవాలు ఇచ్చేందుకు ముందుకు రావాలి: ప్రధాని పిలుపు
 
 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ డీ, సీ, బీ నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ దాదాపు 35 నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ‘చిన్నచిన్న ఉద్యోగాలకు సిఫార్సుల కోసం నిరుద్యోగులు అనేక కష్టాలు పడుతుంటారు. దళారుల చేతిలో మోసపోతుంటారు. ఉద్యోగం దొరికినా, దొరక్కపోయినా డబ్బులు మాత్రం పోతాయి.  చిన్న ఉద్యోగాలయకూ  ఇంటర్వ్యూలు ఎందుకనిపించింది. ఒకట్రెండు నిమిషాల ఇంటర్వ్యూలో అభ్యర్థి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసే మనోవైజ్ఞానికుడు ప్రపంచంలో ఉన్నట్టు నేను ఎప్పుడూ వినలేదు. అందుకే చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూల సంస్కృతి నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించాం’ అని తెలిపారు.

 ఒక్కటిగా ముందుకు సాగుదాం...
 దేశంలో కులం, మతాలవారీగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని ‘ఏకత్వ’ మంత్రాన్ని జపించారు. భిన్నత్వంలో ఏకత్వమనే మంత్రంతో పురోగమిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘భారత్ ఎంతో వైవిధ్యం. ఎన్నో తెగలు, కులాలు, మతాలు, భాషలకు ఆలవాలం. ఈ భిన్నత్వంలోనే మన దేశ సౌందర్యం దాగుంది. ఇంత వైవిధ్యం ఉండడం మనకు గర్వకారణం. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రాన్ని మన భావన , ఆలోచనలు, ప్రవర్తనలో ముందుకు తీసుకువెళ్దాం. దేశం పురోగమించేందుకు ఇది అత్యావశ్యకం’’ అని అన్నారు.

ఈ నెల 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రజలంతా ఒక్కటిగా మెలగాలని సూచించారు. పటేల్ జయంతి రోజున ఏటా నిర్వహించే ఏకతా పరుగును ‘అభివృద్ధి పరుగు’గా అభివర్ణించారు. హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల సజీవ దహనం, ఉత్తరప్రదేశ్‌లో గోమాంసం తిన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చంపేయడం వంటి ఘటనల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మీడియా చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఏబీపీ న్యూస్ (ఏ భారత్ దేశ్ హై హమారా), ఎన్డీటీవీ (బనేగా స్వచ్ఛ ఇండియా), ఇండియా టీవీ (మిషన్ క్లీన్ ఇండియా) సహా వందలాది చానళ్లు, వేలాది పత్రికలు పారిశుధ్యంపై జనాన్ని జాగృతం చేస్తున్నాయన్నారు.

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కూడా ఇందులో భాగస్వామ్యమై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ‘‘రామోజీరావు వయసు పెద్దదే అయినా ఆయనలో ఉత్సాహం చూస్తే యువకునికి తక్కువేమీ కాదనిపించింది. పారిశుధ్య కార్యక్రమాన్ని ఆయన ఒక మిషన్‌గా చేపట్టారు. ఈటీవీ ద్వారా ఏడాది నుంచి పారిశుధ్య పనులను ప్రోత్సహిస్తున్నారు. ఆయన పత్రికలో స్వచ్ఛ భారత్‌కు సంబంధించి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ, తెలంగాణలోని సుమారు 56 వేల పాఠశాలలకు చెందిన 51 లక్షల మంది విద్యార్థులను స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు’’ అని అన్నారు.

 మోదీ ఇంకా ఏమన్నారంటే..
► విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీసుకున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు గ్రామంలో నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులను అక్షరాస్యులుగా మార్చే పనిని విద్యార్థులకు అప్పచెప్పారు. సుమారు 550 వయోజనులను అక్షరాస్యులను చేశారు. ఎలాంటి బడ్జెట్, ప్రభుత్వ ఉత్తర్వుల్లేవు. దృఢ సంకల్పంతో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చనేది ద్వారపూడి పంచాయతీని చూస్తే తెలుస్తుంది.
► కొచ్చిలోని చిత్తూర్ సేయింట్ మేరీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వేలిముద్రలతో భారత దేశ పటం, భరత మాత చిత్రాన్ని దింపి నాకు పంపారు. అవయదానం చేయాలని ప్రజలను కోరాలని లేఖలో కోరారు.
► దేశంలో కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి అవసరం ఉన్నవారు ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉంటున్నారు.  అవయవ దాతల సంఖ్య 5 వేలే. నలుగురికి నేత్రదానం అవసరం అయితే ఒక్కరికే ఇవ్వగల్గుతున్నాం. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడిన సమయాల్లో అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలి. అవయవదానాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌ను(నోటో)ను ఏర్పాటు చేశాం.
► ధన్‌తేరస్ ముందు ముఖ్యమైన పథకాలను ఆవిష్కరిస్తాం. బంగారాన్ని డబ్బుగా మార్చే పథకాన్ని తెస్తున్నాం. ఈ పథకం కింద మీ బంగారాన్ని బాం్యకుల్లో జమ చేసుకోవచ్చు. దానిపై బ్యాంకు ద్వారా వడ్డీ లభిస్తుంది.
 
 ఉద్వేగంతో ఎదురుచూస్తున్నా
 వచ్చే నెలలో బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్‌లోని బీఆర్ అంబేద్కర్ ఇంటిని సందర్శించేందుకు తానెంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. తన బ్రిటన్ పర్యటనపై ఆయన ఆదివారం స్పందించారు. ‘‘దీపావళి (నవంబర్ 11) తరువాతి రోజున బ్రిటన్‌కు వెళుతున్నా. ఈ పర్యటన నాలో ఉద్వేగాన్ని కలిగిస్తోంది. ఇందుకు గల కారణం ఎంతో ప్రత్యేకం. కొన్నివారాలక్రితం అంబేద్కర్ మెమోరియల్‌కు శంకుస్థాపన చేసేందుకు ముంబై వెళ్లాను. ఇప్పుడు లండన్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ఇంటిని వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించబోతుండడం నాకెంతో గర్వకారణంగా ఉంది.

ఇదిప్పుడు భారత ప్రభుత్వ ఆస్తి’’ అని మోదీ అన్నారు. దళితులకు అంబేద్కర్ స్ఫూర్తిప్రదాత అని మోదీ కీర్తించారు. మోదీ తన పర్యటనలో భాగంగా బ్రిటన్‌లో రెండురోజులపాటు గడపనున్నారు. ఆ సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో చర్చలు జరుపుతారు. పలువురు ఇతర నాయకులనూ కలుస్తారు. వెంబ్లే స్టేడియంలో భారత సంతతికి చెందిన వారినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం టర్కీలో జరిగే జీ-20 సదస్సుకు హాజరవుతారు.

మరిన్ని వార్తలు