శ్రీరాం నిర్బంధం కేసులో శ్రీధర్ బాబుకు హైకోర్టు నోటీసులు

24 Dec, 2013 14:39 IST|Sakshi
శ్రీరాం నిర్బంధం కేసులో శ్రీధర్ బాబుకు హైకోర్టు నోటీసులు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జేఏసీ నేత శ్రీరాం నిర్బంధం కేసులో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మంగళవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  మంత్రి శ్రీధర్ బాబు ఆయన అనుచరుల అక్రమాలు, అవినీతిపై కరపత్రాలు పంచినందుకు తన భర్త శ్రీరామ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసకు గురిచేశారంటూ ఇఫ్లూ విద్యార్థిని వి.స్వరూప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
 
కరపత్రాలు పంచితేనే అరెస్ట్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. బాధితుడిని పోలీసులు నిజంగానే హింసించారా, శారీరక దాడులకు పాల్పడ్డారా అనే కోణంలో  నిమ్స్, అపోలో, కేర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు సభ్యులుగా కమిటీని ఏర్పాటుచేసింది.
 
శ్రీరాంపై పోలీసులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మంత్రి శ్రీధర్ బాబుతోపాటు కరీంనగర్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 
 
మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ జిల్లా పోలీసుల నుంచి తన భర్త శ్రీరామ్‌కు ప్రాణహాని ఉందని, అండర్‌ట్రైల్ ఖైదీగా ఉన్న అతనికి తగిన భద్రత కల్పించడంతో పాటు సరైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించేలా అధికారులను ఆదేశించాలంటూ స్వరూప గురువారం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు