మైనింగ్‌పై పూర్తి నిషేధం

29 Mar, 2017 08:38 IST|Sakshi

ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు నెలల పాటు మైనింగ్‌ను పూర్తిగా నిషేధించింది. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపౌ ఉన్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేయాలని, దానిద్వారా అన్ని విషయాలూ తెలుసుకని, నాలుగు నెలల తర్వాత అయినా మైనింగ్‌ను పునరుద్ధరించాలో వద్దో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా 50 ఏళ్లకు సరిపోయేలా ఒక బ్లూప్రింట్‌ను కూడా ఈ కమిటీ తయారుచేయాల్సి ఉంటుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్ వల్ల హిమాలయాల్లోని శివాలిక్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న అడవులు, నదులు, జలపాతాలు, సరస్సులు అన్నీ దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విషయాలు చెప్పింది. సమగ్ర నివేదిక వచ్చేవరకు మైనింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మైనింగ్ మాఫియా చేతుల్లో ఒక అటవీ శాఖాధికారి హత్యకు గురి కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మైనింగ్ వ్యవహారాలపై కలకలం రేగింది. అనంతరం దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సుధాంశు ధులియా ఈ ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ వల్ల శివాలిక్ ప్రాంతం బాగా దెబ్బతింటోందని, ఇక రాష్ట్రంలో అసలు అక్రమ మైనింగ్ అన్నది లేకుండా రాష్ట్రప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టుకు తమ నివేదిక ఇచ్చేవరకు రాష్ట్రంలో మైనింగ్ జరగడానికి గానీ, లైసెన్సులు ఇవ్వడానికి గానీ, పునరుద్ధరించడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు