చట్ట ప్రకారమే విచారించండి

26 Jul, 2017 02:53 IST|Sakshi
చట్ట ప్రకారమే విచారించండి

► చార్మీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ సిట్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించే హీరో యిన్‌ చార్మీ కౌర్‌ను విచా రించాలని డ్రగ్స్‌ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎక్సైజ్‌ సిట్‌) అధికారు లను హైకోర్టు ఆదేశిం చింది. చార్మీ ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూ నాలను సేకరించవద్దని.. ఈ విషయంగా ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచిం చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. 

విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసా గించవచ్చని సూచించిం ది. ఈ కేసులో ప్రస్తుతం చార్మీ సాక్షి మాత్రమేనని, నిందితురాలు కాదు కాబట్టి విచారణ సమ యంలో న్యాయవాది అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ.. తనను న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలో విచారించేలా.. బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను తీసుకోకుండా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈవ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు.

బలవంతంగా చేస్తున్నారు..
తొలుత చార్మీ తరఫున న్యాయవాది పి.విష్ణువ ర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ వ్యవహా రానికి సంబంధించి ఎక్సైజ్‌ అధికారులు జూలై 12న చార్మీకి నోటీసులు ఇచ్చి, 26న హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. సిట్‌ అధికారులు ఇలా విచారణకు పిలిచిన వారి నుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మీ విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. ఈ  కేసులో చార్మీ నిందితురాలుగానీ, అనుమానితురాలు గానీ కాదని.. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విచారణ సమయంలో న్యాయవాదిని వెంటబెట్టుకు నేందుకు అనుమతించాలని కోరారు.

బలవంతమేమీ లేదు
అనంతరం ఎక్సైజ్‌ సిట్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌ వాదనలు వినిపించారు. విచా రణ జరిపే చోటును నిర్ణయించుకునే వెసు లుబాటును చార్మికే ఇచ్చామని.. అయినా ఆమె స్వచ్ఛందంగా సిట్‌ కార్యాలయానికి వచ్చేందుకు అంగీకరించారని కోర్టుకు వివ రించారు. సిట్‌ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదన్నారు.

సోమవారం హీరో నవదీప్‌ నమూనాలు ఇచ్చేందుకు తిరస్కరించారని, దాంతో అధికారులు నమూనాలేవీ సేకరించలేదని తెలిపారు. మహిళా అధికారుల సమక్షం లోనే చార్మిని విచారిస్తామని.. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తున్నం దున న్యాయవాది కూడా అవసరం లేదని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాద నలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు.  

 

మరిన్ని వార్తలు