100 మంది యువకులను మోసగించి...

9 Jul, 2016 14:05 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనీ ట్రాప్ గ్యాంగ్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఉద్యోగాలు చేస్తూ సోషల్ మీడియాను వినియోగించే యువకులే లక్ష్యంగా ఈ గ్యాంగ్ లు నడుస్తున్నాయి. నగరంలో తాజాగా జరిగిన ఓ సంఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఢిల్లీ హోం గార్డు శాఖకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా యువకులను మోసగించి డబ్బులు దోచుకున్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలట్ ను ఓ ముఠా బెదిరించి రూ.9.70 లక్షలు దోచుకుందని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన సియా అనే అమ్మాయితో గత ఏడాది ఫ్రెండ్ అయ్యాడని, కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమా పూర్తయిన తర్వాత ఆమె తన ఫ్లాట్ కు వెళ్దామని చెప్పిందని, దారిలో సలోని అనే మరో అమ్మాయిని తన స్నేహితురాలిగా అతని కి పరిచయం చేసిందని తెలిపారు. వాళ్లిద్దరితో కలిసి ఫ్లాట్ కు వెళ్లగా.. ఉన్నట్టుండి సియా తనను సలోనితో వదిలేసి బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు పోలీసు అధికారుల్లా నటించి అతన్ని ఓ గదిలో బంధించి యువతిని రేప్ చేశావని నిందించారని చెప్పారు. యువతిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారని వివరించారు.

బాధితుడిపై రేప్ కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.10 లక్షలకు కేసును మూసేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని నెలల వరకు మామూలుగానే ఉన్న ఈ ఏడాది మార్చిలో కోర్టులో కేసు ఇంకా పెండింగ్ ఉందని, యువతి కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని కేసు సెటిల్ చేయడానికి మరో రెండు లక్షలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారని చెప్పారు. కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

బాధితుడిని బెదిరించిన ఫ్లాట్ అద్దెకు తీసుకుందని పోలీసులు తొలుత నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ఢిల్లీ హోం గార్డులో పనిచేసే అధికారి జగ్తిందర్ సింగ్ గా గుర్తించి అరెస్టు చేశారు. సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఆర్ధికంగా బలంగా ఉన్నవ్యక్తులను తాము సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి డబ్బులు గుంజినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

మరిన్ని వార్తలు