భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

12 Nov, 2016 12:49 IST|Sakshi
భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

ముంబై: నల్లధనాన్ని అరికట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ500,రూ.1000  నిషేధ నిర్ణయం దీర్ఘకాలంలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బ్యాంకులు అందజేసే రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయని, తద్వారా ఈఎంఐల భారం కూడా  తగ్గనుందని విశ్లేషిస్తున్నారు. ఈ పెద్దనోట్ల రద్దుతో అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరగనున్నా యంటున్నారు.  అయితే  గత రెండేళ్లుగా క్షీణిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్  రేట్లు మరింత పతనమవుతాయని భావిస్తున్నారు.

డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలంలో  తక్కువగానే  ఉన్నప్పటికీ, తక్కువ వడ్డీ రేట్లు తక్కువ ఈఎంఐల ప్రభావంతో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. వినియోగదారుల చేతిలో తక్కువ నగదు నిల్వలు, ద్రవ్యోల్బణం క్షీణత,   బ్యాంకుల వద్ద పెరిగిన  మూల ధన నిల్వలు ఈ పరిస్థితికి దోహదపడనున్నాయని అంచనా వేస్తున్నారు.

 ద్రవ్యోల్బణ క్షీణతకారణంగా ముందు ముందు వడ్డీరేట్లు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని ఔట్ లుక్ ఏసియా క్యాపిటల్ సీఈవో  మనోజ్ నాగ్ పాల్అభప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుందన్నారు. నోట్ల ఉపసంహరణ కారణంగా ఖాతాదారుల్లో ఖాతాలో నగదు నిల్వలు భారీగా పెరగనున్నాయని మరో ఎనలిస్టు అజయ్ బగ్గా చెబుతున్నారు.  కనీసం నాలుగునుంచి అయిదు లక్షల కోట్ల  రూపాయలకు పెరగనున్నాయన్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుతం చెలమాణీలోఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 85 శాతం (17లక్షల కోట్లు) వాటా నిషేధిత నోట్లదే.

కాగా పెద్ద నోట్ల రద్దుతో సాధారణ స్థాయి కంటే సగటున రెండు, మూడు రెట్లు అధికంగా దాదాపు అన్ని శాఖల్లో డిపాజిట్లు  నమోదుకానున్నట్టు బ్యాంకుర్లు కూడా అంచనావేస్తున్నారు. రెండు, మూడో అంచె పట్టణాల్లోని మధ్య తరగతి వర్గం, ఉద్యోగులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్న ధోరణి నెలకొందని, ఇది మరికొన్న రోజులు కొనసాగవచ్చని  ఆశిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు