హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ దిగ్గజం హెచ్పీ, విద్యార్థులు సులభపద్ధతిలో ల్యాప్టాప్, డెస్క్టాప్లను కొనుగోలు చేసేలా రుణసౌకర్యాన్ని కల్పిస్తోంది. 'బ్యాక్ టూ కాలేజ్' కార్యక్రమంలో భాగంగా సులభవాయిదా పద్ధతిలో ఈ వెసులుబాటును అందిస్తోంది. ఈ రుణసౌకర్యంలో విద్యార్థులు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినవసరం ఉండదు. ముందస్తుగా ఎటువంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం లేకుండా.. 6, 9, 12 నెలల వాయిదాల పద్ధతిలో ల్యాప్టాప్, డెస్క్టాప్లకు తీసుకున్న రుణాన్ని విద్యార్థులు తిరిగి చెల్లించవచ్చు. సిబిల్ స్కోర్ ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ ఈ రుణాన్ని సమకూరుస్తుంది.
ఎంపిక చేసిన మోడళ్లపై రూ.11,998 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చని... ప్రయోజనాల కింద మూడేళ్ల వరకు వారంటీ, బీమా, బ్లూటూత్ స్పీకర్, హెడ్సెట్, హార్డ్ డిస్క్ వంటివి అందుకోవచ్చని హెచ్పీ పేర్కొంటోంది. కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఉన్నా డబ్బులు లేక ఎంతో మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటారని, వారికి ఈ రుణ సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని హెచ్పీ ఇండియా కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ కేటగిరీ హెడ్ అనురాగ్ అరోరా తెలిపారు. కమ్యూనికేషన్స్ ప్రతినిధి దినేష్ జోషితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతారని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 500ల పైచిలుకు హెచ్పీ విక్రయశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా హెచ్పీ పీసీల ప్రారంభ ధర రూ.23 వేలు.