గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను.. కానీ

15 Sep, 2017 17:42 IST|Sakshi
గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను.. కానీ

అన్నానగర్‌: భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఆమెను నరికి హత్య చేశాడు. అంతటితో అగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉలగంధిని(47) పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. తిరువారూర్‌ జిల్లా వడపూర్‌ మెయిన్‌ రోడ్డుకి చెందిన ఉలగంధి మేస్త్రీ పని చేస్తూ జీవనం గడిపేవాడు. ఈయన మునీశ్వరి(36)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కిరుబాదేవి(19), ప్రియదర్శిని (06) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 మునీశ్వరి తల్లి ఓ బ్యాంకులో పని చేస్తుంది. ఆరోగ్యం సరిగాలేనప్పుడు ఆమె వెళ్ళి వస్తుంది.  ఉలగంధి రోజు మద్యం తాగి వచ్చి మునీశ్వరి ప్రవర్తనపై అనుమానపడి తగాదా చేస్తూ వచ్చాడు. ఈ స్థితిలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. కిరుబాదేవి తల్లికి ఫోన్‌ చేసింది.  ఫోన్‌ తీయకపోవడంతో ఆమె తల్లిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీ నుంచి లోపలికి చూస్తే తల్లి చేతులు, తల ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. తల్లి మృత దేహాన్ని చూసి దిగ్ర్భాంతి చెందిన కూతురు భోరున ఏడ్చింది.

ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసి దిగ్భ్రాంతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మన్నార్‌కుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి భర్త ఉలగంధిని అరెస్టు చేసి విచారణ చేశారు. నా భార్య మీద అనుమానం ఉంటూ వచ్చింది. గురువారం రాత్రి ఈ విషయంలో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది.

ఆవేశంలో ఇంటిలో ఉన్న కత్తితో ఆమెను నరకడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తరువాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు చేతులను, తలను ముక్కలుగా చేశాను. పైగా నడుము భాగాన్ని గొడ్డలితో నరకటానికి ప్రయత్నించాను, కాని నా వల్ల కాలేదు. అందుకే ఇంటికి తాళం వేసి వెళ్ళానని విచారణలో తెలిపాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మరిన్ని వార్తలు