హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?

23 Dec, 2013 01:58 IST|Sakshi

హెచ్‌ఎస్‌బీసీ ఫ్లెక్సి డెట్ గ్రోత్ ఫండ్‌లో ఆర్నెల్ల క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. వేరే ఫండ్‌కు మారిపోవడం మంచిదా? దీంట్లోనే కొనసాగమంటారా?
 - ఆంజనేయులు, నరసాపురం

 మరీ దీర్ఘకాలానికి కాకుండా, మరీ స్వల్పకాలానికి కాకుండా కొంత కాలం పెట్టుబడులకు మాత్రమే డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. జూన్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించడంతో ఈ ఫండ్స్‌పై ప్రభావం పడింది.  రానున్న రెండేళ్లలో ఈ ఫండ్ పనితీరు బాగా ఉంటుంది. అప్పటివరకూ ఓపిక పట్టగలిగితే ఈ ఫండ్‌లోనే కొనసాగండి. అప్పటి వరకూ వేచి ఉండే వెసులుబాటు లేకపోతే, ఈ ఫండ్ నుంచి మీ పెట్టుబడులను ఉపసంహరించి, మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ కాల పరిమితి ఉన్న డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ), లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్-టెర్మ్ ఫండ్స్, ఇతర షార్ట్‌టెర్మ్ ఫండ్‌లను కూడా పరిశీలించవచ్చు.
 
 డాబర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి అవైవా సంస్థ వైదొలగాలని యోచిస్తున్నట్లు వార్త చదివాను. ఈ జేవీ నుంచి నేను అవైవా ఐ-లైఫ్ టెర్మ్ బీమా పాలసీ తీసుకున్నాను. వచ్చే నెలలో ఈ పాలసీని రెన్యూవల్ చేయాల్సి ఉంది.  ఈ పరిస్థితుల్లో ఈ పాలసీని రెన్యూవల్ చేయమంటారా? లేక వేరే కంపెనీకి మారిపోమ్మంటారా?  
 - శశికళ, నెల్లూరు

 భారత్‌కు చెందిన డాబర్ ఇండియా గ్రూప్, ఇంగ్లాండ్‌కు చెందిన అవైవా పీఎల్‌సీలు కలిసి అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో అవైవాకు 26 శాతం వాటా ఉంది. ఈ జేవీ నుంచి అవైవా వైదొలుగుతున్న వార్తల పట్ల మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో కూడా కొన్ని విదేశీ కంపెనీలు దేశీయ కంపెనీలతో ఏర్పాటు చేసిన జేవీల నుంచి వైదొలిగాయి. ఇలా వైదొలిగేటప్పుడు తమ వాటా ను ఇతర కంపెనీకో లేక జేవీలోని ఇతర భాగస్వామికో విక్రయించేవి. అందువల్ల మీ పాల సీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీ పాలసీ ఇంతకు ముందున్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటుంది. నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులుండవు. ఎలాంటి ఆందోళన చెందకుండా మీ పాలసీని రెన్యూవల్ చేయించండి. మీరు కొత్త పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు.
 
 ఇటీవల మార్కెట్లోకి చాలా క్లోజ్‌డ్-ఎండ్ హైబ్రీడ్ ఫండ్స్ వచ్చాయి. వీటిల్లో అధిక భాగం రుణ పత్రాల్లోనూ, స్వల్పమొత్తంలో ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
 - శేఖర్, విజయవాడ

 ఇలాంటి ఫండ్స్‌ల్లో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టిపుల్ ఈల్డ్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ఈ ఫండ్స్ ఇప్పుడు ఓపెన్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయనివారికి, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ ఫండ్స్ అనుకూలం. ఈ ఫండ్స్‌లో అధిక భాగం స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో,  30-35  శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తున్నప్పటికీ, మీరు పొందే రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్‌ఎంపీ), షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్స్ కొంచెం మెరుగు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని దానికి దీటుగా రాబడిని ఇవ్వలేవు. మీరు పేర్కొన్న హైబ్రీడ్ ఫండ్స్ 30 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్థిర ఆదాయ సాధనాల కంటే మెరుగైన రాబడి వస్తుందని చెప్పవచ్చు. ఓపెన్ ఎండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి రోజూ ఎన్‌ఏవీ ఎంత ఉంటుందో అని ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్దేశిత కాలపరిమితి ఉన్న క్లోజ్‌డ్-ఎండ్ ఫండ్స్‌లో  కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ కాలపరిమితి తీరిన తర్వాతే ఆ ఫండ్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన రాబడినే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఇస్తున్నాయి. అందుకని తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇలాంటి ఫండ్స్ ఉత్తమం. ఇవి క్లోజ్‌డ్ ఎండ్ ఫండ్స్ కనుక క్రమం తప్పకుండా(నెలకొకసారి/రెండు నెలలకొకసారి కొంత కొంత మొత్తాల్లో)  ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్స్  అనుకూలం కాదు.
 
 నేను బజాజ్ యూనిట్ గెయిన్ టూ,  హెచ్‌డీఎఫ్‌సీ యంగ్‌స్టర్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ రెండు యులిప్స్‌లకు  క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్లున్నాయి. రైడర్లను కొనసాగించమంటారా? వద్దంటారా?  
 - క్రిష్టోఫర్, సికింద్రాబాద్

 రైడర్లను కొనసాగించాలో, వద్దో  అనేది పాలసీదారు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీరు రైడర్‌లు వద్దనుకుంటే, ఒక దరఖాస్తును నింపి సదరు బీమా సంస్థకు సమర్పించాలి. రైడర్ నుంచి ఒకసారి వైదొలిగితే, భవిష్యత్తులో దానిని పునరుద్ధరించే వీలు లేదన్న విషయాన్ని మాత్రం మరువకండి.

ధీరేంద్ర కుమార్

సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్

మరిన్ని వార్తలు