ఐ లవ్ 'జులాయి'

7 Jul, 2015 12:29 IST|Sakshi
ఐ లవ్ 'జులాయి'

హైదరాబాద్ : మోడల్ నుంచి హీరోయిన్ మారిన దిశా పటాని ఐ లవ్ అల్లు అర్జున్ అంటుంది. ముకుంద చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన వరుణ్ తేజతో కలసి దిశా పటాని హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయం అయ్యాడని దిశ పటాని తెగ ముచ్చటపడుతూ చెప్పింది. మంగళవారం హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ ...  జులాయి... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జెంటిల్మెన్ అని కితాబు ఇచ్చింది. అతడికి పెద్ద ఫ్యాన్ అయిపోయానంది.


అతడి డ్యాన్సింగ్ స్కిల్స్ చూస్తే మతిపోతుందంది. అల్లు అర్జున్తో కలసి పని చేయాలని ఉందని తన మనస్సులోని మాటను ఈ సందర్భంగా బయటపెట్టింది. అయితే అతడి పక్కన హీరోయిన్ కాకపోయినా ఫర్వాలేదు కానీ కనీసం ఓ సినిమాలో అయిన అర్జున్ తో కలసి డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా తనకు సంతోషమే అంటూ సిగ్గుపడుతూ చెప్పింది.

తాజాగా పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ చిత్ర సీమలో అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని దిశా పటాని పేర్కొంది. టాలీవుడ్లో ప్రవేశించేందుకు గతేడాది పూరీ జగన్నాథ్ను కలిశానని ... కానీ ఆ సమయంలో అనుకున్న చిత్రం ఎందుకో తెరకెక్కలేదని చెప్పింది.

ఉత్తరాఖండ్కు చెందిన దిశా పటాని న్యూఢిల్లీలో చదివింది. ఆమె రెండేళ్ల క్రితం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాగీ'. ఆ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు