భారత్‌పైకి ఏలియన్స్‌ దండయాత్ర!?

20 Sep, 2016 18:46 IST|Sakshi
భారత్‌పైకి ఏలియన్స్‌ దండయాత్ర!?

మీరు నమ్మండి.. నమ్మకపోండి. కానీ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ప్రభుత్వానికి అందే వేలాది ప్రశ్నల్లో.. ప్రజలకు ఉపయోగపడేవి.. సమాచారాన్ని ఇచ్చేవే కాదు.. ప్రభుత్వ అధికారులను తికమక పెట్టే వికృతమైన వెర్రీమొర్రి ప్రశ్నలు కూడా ఎన్నో ఉంటున్నాయి. రామ్‌లీలా నాటకంలో ప్రధాని మోదీ నటించారా? మహాత్మాగాంధీ ఐక్యూ ఎంత? దేశంలోని పచ్చగా ఉన్న చెట్లు ఎన్ని, ఎండిపోయినవి ఎన్ని? రాఖీపూర్ణిమ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బూష్‌కు పంపిన లడ్డూలు ఎందుకు వెళ్లలేదు? ఇలాంటి వెర్రి ప్రశ్నలెన్నో ఆర్టీఐ ద్వారా ముందుకొచ్చాయి. కానీ తాజాగా ఆర్టీఐ ద్వారా తెరపైకి వచ్చిన ప్రశ్న మాత్రం ఈ వెర్రి ప్రశ్నల్లోనే  మహా వెర్రి ప్రశ్న అని చెప్పవచ్చు. ఎందుకంటారా? ముంబైకి చెందిన అజయ్‌ కుమార్‌కు ఒక డౌటు వచ్చింది. దేశం మీద ఒక్కసారిగా గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దండయాత్రకొస్తే.. దానిని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా? అంటూ ఆయనకు సందేహం వచ్చింది.

దీంతో వెంటనే ఆర్టీఐ ద్వారా ఓ ప్రశ్నాస్త్రాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. ’గ్రహాంతర వాసులు, జాంబీలు, మానవాతీత శక్తులు దేశంపై దండయాత్రకు వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందా?.. ఈ అంశం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నాకు చెప్పాలి. ప్రభుత్వం వాటిని ఓడించడానికి ఏం చేయబోతున్నది? విల్‌ స్మిత్‌ లేకుండా మనం వాటిని ఎదర్కోగలమా?’ అంటూ ఆయన ప్రశ్నించాడు. 1996నాటి సైన్స్‌-ఫిక‌్షన్‌ హాలీవుడ్‌ సినిమా ’ఇండింపెండెన్స్‌ డే’ సినిమాలో విల్‌ స్మిత్‌ ఎలియన్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన సాయం తీసుకోమంటూ ఉదారంగా సలహా కూడా ఇచ్చాడు. తాజాగా ట్విట్టర్‌ లో జర్నలిస్టు అభిమాన్యు ఘోషల్‌ పెట్టిన ఈ ఆర్టీఐ ప్రశ్న ఫొటోకాపీ వైరల్‌ గా మారిపోయింది.
 

మరిన్ని వార్తలు