ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టండి

9 Jan, 2014 01:58 IST|Sakshi
ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టండి

న్యూఢిల్లీ: భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని దక్షిణ కొరియా కంపెనీలను ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. దేశానికి 8 శాతం వృద్ధిరేటును తిరిగి సాధించగల సత్తా ఉందని.. మందగమనం నుంచి తిరిగి పుంజుకోవడానికి తమ ప్రభుత్వం గత కొద్దినెలల్లో అనేక సంస్కరణలు, విధానపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని పెట్టుబడులతో తరలిరావాలన్నారు. భారత్-దక్షిణ కొరియా ఆర్థిక శాఖల నాలుగో ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో దక్షిణ కొరియా ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి హ్యూన్ ఓహ్ సియోక్ పాల్గొన్నారు. కొరియా స్టీల్ దిగ్గజం పోస్కో ఒరిస్సాలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని ఈ సందర్భంగా చిదంబరం తెలిపారు. కాగా, తదుపరి ద్వైపాక్షిక భేటీ దక్షిణ కొరియాలో జరగనుంది.

>
మరిన్ని వార్తలు