ముంబై: దేశీయ అతిపెద్ద టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అధిగమిచింది. 2016 సంవత్సరంలో ఆదాయం రికార్డ్ స్థాయిని తాకింది.10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 67,500 కోట్లు) ఆదాయం నమోదు చేసి, కీలకమైన మైలురాయిని తాకింది. డిసెంబర్ త్రైమాసికంలో ఊహించినదానికంటే ఎక్కువ నికర లాభాన్ని నమోదుచేసింది.రూ.3,708 కోట్ల నికర లాభాలను సాధించింది. డాలర్ ఆదాయం 1.4 శాతం క్షీణించి 2,551 మిలియన్ డాలర్లు గాను, రుపీ ఆదాయం రూ.17,273 కోట్లుగాను నివేదించింది. సెప్టెంబర్ క్వార్టర్ రూ.17,310 కోట్లతో పోలిస్తే క్షీణించింది. ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలకంటే మెరుగ్గానే 25.1గా నిలిచింది
మూడవ త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా రికార్డు స్థాయి ఆదాయ వివరాలను ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వెల్లడించారు. ఇన్ఫోసిస్ 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల మైలురాయిని సాధించే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరింతగా ఎదుగనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల వలసలు ( ఆట్రిషన్) సీక్వెన్షియల్ గా 0.8 శాతం తగ్గినట్టు కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు తెలిపారు. ఆట్రిషన్ తగ్గించడానికి కృషి చేస్తున్నామనీ, ఉద్యోగుల వలసలు క్రమంగా తగ్గాయని చెప్పారు. అలాగే సంస్థ కొత్త డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎస్ రవికుమార్ ను నియమించినట్టు ఇన్ఫీ ప్రకటించింది. ప్రస్తుతం రవికుమార్, గ్లోబల్ డెలివరీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఆదాయ వృద్ధి అంచనా 8.4 నుంచి 8.8 శాతం వరకూ ఉండవచ్చని సిక్కా పేర్కొన్నారు. డాలర్ రెవెన్యూ గైడెన్స్ కోతకు తోడు ఆదాయం అంచనాలకు అందుకోలేకపోవడం, మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉండడంతో ఇన్ఫోసిస్ షేరు 2 శాతానికిపైగా నష్టాలను నమోదుచేసింది.