నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ

18 May, 2017 16:13 IST|Sakshi
నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ

తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐబీకి బదిలీ చేశారు. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు.

మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్‌ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్‌ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు