ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐఫోన్!

3 Aug, 2014 16:53 IST|Sakshi
Mi3

వ్యాపార పరంగా ప్రస్తుతం ప్రపంచంలో హాటెస్ట్‌ సెక్టార్‌ ఏది అంటే ఎవరైనా ఠక్కున మొబైల్‌ రంగమని చెబుతారు. అది వాస్తవం కూడా. ఇందుకు తాజాగా ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎంఐ3 చైనా ఐఫోన్‌గా పేరుగాంచింది. ఈ ఫోన్‌ చైనాలో భారీ స్థాయిలో అమ్ముడయింది. ఇప్పుడు భారత్లో కూడా అదే రీతిన ప్రకంపనలు సృష్టిస్తోంది.  విడుదలైన 39 నిమిషాల్లో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. కొత్త తరహా ఫోన్లపై ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంత మోజు ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది.

కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు మొబైల్‌ ఫోన్‌ ప్రియులు స్మార్ట్‌ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.  షియోమి ఎంఐ3 ఫోన్‌కు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనం. చైనా 'యాపిల్‌'గా పేరు గడించిన షియోమీ సంస్థ తన ఎంఐ3 ఫోన్‌ను భారత్‌లో విక్రయించేందుకు ఇ-కామర్స్‌ పోర్టల్‌ ఫ్లిఫ్‌కార్టుతో ఒప్పందం చేసుకుంది. ఈమేరకు ఎంఐ3ని ఫ్లిఫ్‌కార్ట్‌ తన పోర్టలో విక్రయానికి పెట్టింది. జూన్‌ 22న ఎంఐ3 ఫోన్‌ అమ్మకానికి వచ్చిన 39 నిమిషాల్లోనే అందుబాటులో ఉంచిన స్టాక్‌ మొత్తం అయిపోయింది.  లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై 15 నుంచి జూలై 21 మధ్యకాలంలో ఈ ఫోన్‌ కోసం లక్షకు పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్టు ఫ్లిఫ్‌కార్ట్‌ తెలిపింది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్‌  చెబుతోంది. కొత్త స్టాక్‌ కోసం ప్రయత్నిస్తున్నామని, స్టాక్‌ రాగానే విక్రయిస్తామని, ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తోంది.

ఎంఐ3 ఫోన్‌కు ఇంత డిమాండ్‌ ఉండటానికి కారణం ఐఫోన్‌ 5ఎస్, గెలాక్సీ ఎస్5ల్లో ఉన్న ఫీచర్స్‌ కంటే మెరుగైన ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ఐఫోన్‌ 5ఎస్లో 1.3 గిగాహెడ్జ్‌ డ్యుయల్‌ కోర్‌ ఏ7 ప్రాసెసర్‌ ఉంటే, ఎంఐ3లో 2.3 గిగాహెడ్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 800 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ ఉంది. ఐఫోన్‌ 5ఎస్లో 8 మెగాపిక్సెల్‌ కెమేరా ఉంటే, ఇందులో 13 మెగాపిక్సెల్‌ కెమేరా ఉంది. ఐఫోన్‌లో బ్యాటరీ 1560 ఎంఏహెచ్ కాగా, ఇందులో  3050 ఎంఏహెచ్గా ఉంది.  ఐఫోన్‌ 5ఎస్ 43 వేల రూపాయలు, గెలాక్సీ ఎస్5 ధర 37 వేల రూపాయలు కాగా, ఎంఐ3 ధర15 వేల రూపాయలే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ హైఎండ్‌ ఫోను కన్నా ఎంఐ3లో ఎక్కువ ఫీచర్స్‌ ఉన్నాయి. ఇందువల్లే ఈ ఫోన్‌ హాట్‌కేకుగా మారింది. ఈ ఫోన్ ఆన్లైన్లో కూడా సంచలనం సృష్టించింది. ఫోన్ విడుదలకు ముందు రిజిస్ట్రేషన్కు అవకాశం ఇస్తే  86 సెకండ్లలో  లక్ష ఫోన్‌లను బుక్ చేసుకున్నారు. విడుదల అయిన తరువాత 39 నిమిషాలలో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి.

 షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో  అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో బీజింగ్ కేంద్రంగా  లీ జున్ దీనిని ప్రారంభించారు. ఈ కంపెనీ వ్యాపారం అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. అందువల్ల ఈ సంస్థ మార్కెటింగ్కు చాలా తక్కువగా నిధులు కేటాయిస్తుంది. ఆ రకంగా ఎక్కువ ఫీచర్స్తో తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నట్లు యాజమాన్యం తెలిపింది.

 - శిసూర్య

>
మరిన్ని వార్తలు